Hyundai | న్యూ ఎస్యూవీ వెహికల్స్ వెన్యూ, టక్సన్, ఫ్లాగ్షిప్ మిడ్సైజ్డ్ ఎస్యూవీ క్రెటా కార్లకు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ దన్నుతో దేశీయంగా కార్ల విక్రయంలో రికార్డులు సృష్టించాలని తలపోస్తున్నది దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్స్. ప్రస్తుతం కార్ల మార్కెట్లో రెండో స్థానంలో కొనసాగుతున్న హ్యుండాయ్ మోటార్స్.. చిప్ సరఫరా వేగవంతం కావడంతోపాటు పండుగల సీజన్ ముంగిట ఉత్పత్తి పెంచుతోంది. 2018-19లో ఐదు లక్షలకు పైగా కార్లకు విక్రయించిన రికార్డులను బ్రేక్ చేయాలని భావిస్తున్నది హ్యుండాయ్.
గత రెండేండ్లుగా కొవిడ్-19 ఆంక్షలు, సెమీ కండక్టర్లు ఇతర విడి భాగాల కొరత, సరఫరాలో సమస్యలతో కార్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రస్తుతం రెండు లక్షలకు పైగా కార్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని హ్యుండాయ్ పాపులర్ వేరియంట్ కార్ల కోసం కస్టమర్లు నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ప్రస్తుతం ఏడు లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. 1.30 లక్షల బుకింగ్స్ పెండింగ్లో పెండింగ్లో ఉన్నాయంటే హ్యుండాయ్ కార్లకు ఉన్న గిరాకీ అర్థమవుతున్నది.
ఇటీవలి కాలంలో గట్టి పోటీ ఇస్తున్న టాటా మోటార్స్ను ఢీకొట్టేందుకు గత మూడు నెలలుగా 10 శాతం కార్ల ఉత్పత్తి పెంచేసింది. జనవరి-మే మధ్య నెలకు 43 నుంచి 44 వేల కార్లు ఉత్పత్తి చేశామని హ్యుండాయ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు. ఇప్పుడు 49 వేల యూనిట్ల ఉత్పత్తికి పెంచామని చెప్పారు. అయితే, అధిక వడ్డీరేట్లు, ముడి సరుకు-ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. పెండింగ్లో ఉన్న ఆర్డర్లతోపాటు పండుగల సీజన్లో కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కార్ల నిల్వలు 15-17 రోజులకు మాత్రమే పరిపోతాయన్నారు.
గతేడాది ఐ-20 మాదిరిగానే ఈ ఏడాది ఎన్-లైన్ మోడల్ కార్లపై ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వెన్యూ ఎన్ లైన్ కార్లు పది వేలు అమ్ముడవుతాయని భావిస్తున్నట్లు తరుణ్ గార్గ్ చెప్పారు. స్పోర్టీ మోడల్ కార్లకు కస్టమర్లు ఆకర్షితులవుతున్నారన్నారు. టక్సన్ కోసం ఇప్పటికే 5000 ఆర్డర్లు ఉన్నాయన్నారు.