తెలుగు యూనివర్సిటీ, జనవరి 20: సరికొత్త ఫీచర్లతో వచ్చిన హ్యుందాయ్ క్రెటా కారును శనివారం సాయంత్రం లకిడికాపూల్ ఏసీగార్డ్స్లోగల కున్ యునైటెడ్ హ్యుందాయ్ షోరూంలో లాంచ్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్రావు లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఈ మాడల్ అందుబాటులో ఉన్నది. 1.5సీసీ ఇంజిన్, వీల్స్, సౌండ్ సిస్టం, స్టీరింగ్, సీటింగ్ ఇలా.. అన్ని విభాగాల్లో కొత్తదనం కనిపిస్తున్నది.
ఈ సందర్భంగా జీఎం సురేందర్రావు మాట్లాడుతూ.. హ్యుందాయ్ బ్రాండ్తో తనకు 15 ఏండ్ల అనుబంధం ఉందన్నారు. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కారు ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. అలాగే నమస్తే తెలంగాణ, కున్ యునైటెడ్ భాగస్వామ్యంలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. కున్ యునైటెడ్ వైస్ చైర్పర్సన్ బీ పూర్ణిమ మాట్లాడుతూ.. మార్కెట్కు పరిచయమైన కొత్త క్రెటా మరింత ఆదరణను సొంతం చేసుకోగలదన్న విశ్వాసాన్ని కనబర్చారు. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఈ క్రెటాను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డీజీఎంలు జీ సంతోష్, కార్తీక్, సేల్స్ మేనేజర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.