న్యూఢిల్లీ, జనవరి 16: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్..తన ఎస్యూవీ పరిధిని మరింత బలోపేతం చేసే దిశగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాను ఆధునీకరించి మళ్లీ విడుదల చేసింది. ఈ మాడల్ రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో గరిష్ఠంగా రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ
ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఎస్యూవీలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో ఈ నయా మాడల్ను అభివృద్ధి చేసి విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో సంస్థ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీల వాటా 65 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వాటా 60 శాతంగా ఉన్నది. ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.