తెలంగాణ సహా పలు రాష్ర్టాలకు ప్రకటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తెలంగాణసహా, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు రాష్ర్టాలకు హ్యుందాయ్ మోటర్ ఇండియా బుధవారం రూ.20 కోట్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. కొవిడ్-19 ఉద్ధృతితో ఈ రాష్ర్టాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ దాతృత్వ విభాగం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆయా రాష్ర్టాల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ప్యాకేజీని ఇచ్చింది.
ఈ నిధులతో దవాఖానల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన వనరులను సమకూర్చనున్నారు. అలాగే రాబోయే 3 నెలలపాటు పలు దవాఖానల్లో మెడికేర్ వసతుల కల్పన, సిబ్బంది నిర్వహణ వ్యయాన్నీ భరించేందుకు హ్యుందాయ్ ముందుకు వచ్చింది. కరోనా రెండో దశలో భారత్ మునుపెన్నడూలేని సంక్షోభాన్ని చవిచూస్తున్నదని, అందుకే ఈ మహమ్మారి ప్రభావిత నగరాలు, రాష్ర్టాలకు తమ వంతు సాయం చేస్తున్నామని హ్యుందాయ్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ కిమ్ తెలిపారు.