హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డాటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్టు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు శనివారం టీసీఎస్ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబులతో సచివాలయంలో సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. హైదరాబాద్లో 264 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ల సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డాటా సెంటర్ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి. హైపర్వాల్ట్తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి.
ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్టు టీసీఎస్ సీఈవో, ఎండీ కే కృతివాసన్ తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలు, హైపర్ స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్ప్రైజెస్కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఇది ఒకటిగా నిలువనున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డాటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్తు, కూలింగ్, నెట్వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యవరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్తో ఈ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు కే రామకృష్ణరావు, టీసీఎస్ సీవోవో ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వీ రాజన్న, సీఈవో, ఎండీ దీపేష్ నందా పాల్గొన్నారు.