హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6: ఒక్క నిమిషం చాలు.. ఆరోగ్యంగా ఉన్నామా? లేమా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి. అదేంటి? ఒక్క నిమిషంలో ఎలా తెలుస్తుందని అవాక్కవుతున్నారా?. ఔను కేవలం 60 సెకన్లలో ఆరు ఆరోగ్య పరీక్షల ఫలితాలను వెల్లడించే సాంకేతిక పరికరాన్ని హైదరాబాద్కు చెందిన స్టార్టప్ బ్లూసెమీ రూపొందించింది మరి. అమెరికాలోని లాస్వెగాస్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈవైవీఏ (నాన్ ఇన్వేజివ్ కన్జ్యూమర్ హెల్త్కేర్ గాడ్జెట్)ను ఈ స్టార్టప్ ఆవిష్కరించింది. ఫలితంగా దేశంలోనే మొదటి కన్జ్యూమర్ హెల్త్ టెక్ కంపెనీగా రికార్డులకెక్కింది. ఇక దీని ధర రూ.15,490గా ఉన్నది. ఈ మార్చికల్లా మార్కెట్లో అందుబాటులోకి రావచ్చు. దీని మార్కెటింగ్కు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ-కామర్స్ సంస్థల్లో అమ్మకానికి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది.
ఏమేం తెలుసుకోవచ్చు?
సెన్సార్ ఫ్యూజన్, ఏఐ ఆల్గరిథమ్, స్మార్ట్ ఐవోటీ టెక్నాలజీ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ఈసీజీ, హృదయ స్పందన, బీపీ, ఆక్సీజన్ లెవల్స్, టెంపరేచర్ వివరాలన్నీ ఈవైవీఏపై ఒక్క క్లిక్తో తెలిసిపోతాయి. గుచ్చడం, రక్తం తీయడం లాంటివి లేకుండానే ఇలా ముట్టుకుంటే అలా కేవలం నిమిషం వ్యవధిలో అన్ని వివరాలు వచ్చేస్తాయి. ఈ పరికరంతోపాటు యాంథియా రీల్మ్ అనే మొబైల్ యాప్ సౌలభ్యం కూడా ఉంటుంది. ఫలితంగా ఈ పరికరంతో ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అందుకు అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకునే ప్రయోజనం కలుగుతుంది. ఆహారం, వ్యాయామంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అప్రమత్తమయ్యే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కడికంటే అక్కడికి సులువుగా తీసుకెళ్లేలా ఈవైవీఏను చిన్నగా డిజైన్ చేయడం విశేషం. ఇది ఎక్కడైనా సమర్థవంతంగా పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.
‘అందరూ సులువుగా తమ ఆరోగ్య వివరాలు తెలుసుకోవడం కోసం మేము పడిన కష్టానికి ఈవైవీఏ నిదర్శనం. ఇలాంటి పరికరాన్ని ప్రతిష్ఠాత్మక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆవిష్కరించినందుకు, తద్వారా తొలి భారతీయ హెల్త్ టెక్ కంపెనీగా గుర్తింపు పొందినందుకు గర్వంగా ఉన్నది. ఈ కరోనా పరిస్థితుల్లో ఈవైవీఏ అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది’
-సునీల్ మద్దికట్ల, బ్లూసెమీ సీఈవో