హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నూతన కార్యాలయ భవనాలను, నిర్మాణాలను అధికంగా పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించిం ది. బుధవారం నైట్ ఫ్రాంక్ సంస్థ ‘ఇండియా రియల్ ఎస్టేట్ క్యూ3 -2023’ పేరుతో ప్రత్యేకంగా ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో నగరంలో 5.3 మిలియన్ల ఆఫీస్ స్పేస్ నిర్మాణం పూర్తయినట్టు తేలింది. ఈ క్రమంలోనే దేశంలో గల 8 ప్రముఖ నగరాల్లోని డెలివరీ ఆఫీస్ స్పేస్లో 46 శాతం వాటా హైదరాబాద్దేనని పేర్కొన్నది. అదేవిధంగా నగరంలో సగటు అద్దె నెలకు చదరపు అడుగుకి రూ.65.3గా ఉన్నదని, గతంతో పోల్చితే 11 శాతం వృద్ధి ఉందని తెలిపింది. ఇక ఈ త్రైమాసికంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు జరిపిన లావాదేవీలు 75 శాతంగా ఉన్నాయని, ఇందులో హైదరాబాద్లోనే 31 శాతం జరిగాయని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లోనూ 13 శాతం హైదరాబాద్లోనే జరిగాయి.
ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్లో 8,325 యూనిట్లు అమ్ముడైనట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా తమ నివేదికలో స్పష్టం చేసింది. నిరుడు ఇదే వ్యవధిలో 7,900 ఇండ్ల విక్రయాలు జరిగాయని, దీంతో ఈసారి 5 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతాల్లో క్యూ3 హౌజింగ్ సేల్స్పై నైట్ ఫ్రాంక్ తాజా వివరాలను అందించింది. మొత్తం ఈ 8 నగరాల్లో 12 శాతం పెరిగి 82,612 ఇండ్ల అమ్మకాలు జరిగినట్టు నైట్ ఫ్రాంక్ వివరించింది. దీన్ని ఆరేండ్ల గరిష్ఠ స్థాయిగా పేర్కొన్నది. నిరుడు జూలై-సెప్టెంబర్లో 73,691 యూనిట్లు అమ్ముడయ్యాయి.