హైదరాబాద్, నవంబర్ 28: అంతరిక్షంలోకి ఇటీవల రెండు శాటిలైట్లను పంపించిన హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ధృవ స్పేస్..ఈ రంగంలో దూకుడు పెంచింది. వచ్చే రెండేండ్లలో 100 కిలోల బరువు కలిగిన శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నట్లు, ఇందుకోసం అవసరమైన 20-25 మిలియన్ డాలర్ల(రూ.200 కోట్లకు పైమాటే) నిధులను వచ్చే ఏడాది నుంచి రెండేండ్లలో సేకరించాలనుకుంటున్నట్లు కంపెనీ కో-ఫౌండర్, సీటీవో అభయ్ ఎగోర్ తెలిపారు. ఇటీవల థైబోల్ట్-1, థైబోల్ట్-2 చిన్న స్థాయి శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించిన సంస్థ.. ప్రస్తుతం 30 కిలోల స్థాయి శాటిలైట్లపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఈ నూతన శాటిలైట్లతో కమ్యూనికేషన్స్, సైంటిఫిక్ అప్లికేషన్లు మరింత వేగవంతం కానున్నాయి.
మౌలిక సదుపాయాల కల్పనను మరింత ఆధునీకరించడానికి, వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే రూ.200 కోట్ల వరకు నిధులను వచ్చే రెండేండ్ల లోపు సేకరించాలనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 కిలోల శాటిలైట్ను తయారు చేయడానికి హైదరాబాద్లో అసెంబ్లింగ్ యూనిట్ను నెలకొల్పాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించి పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. గత పదేండ్లుగా స్పేస్ స్టార్టప్గా సేవలు అందిస్తున్న ధృవ ఇప్పటి వరకు 8 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.