హైదరాబాద్: టీనేజ్-ఫోకస్డ్ ఫిన్టెక్ స్టార్టప్ ‘పెన్సిల్టన్’ మనీ మేనేజ్మెంట్లో యువతకు అండగా నిలుస్తున్నది. తన యాప్ ద్వారా డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీని పెంచుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ, మార్కెట్లో ముందుండేలా ప్రత్యేకమైన కొలమానాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.
బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు విశ్వజిత్ పురేటి, ఆశిష్ సింగ్, పల్లవి తిప్పరాజు, విరాజ్ గద్దె.. 2020లో ‘పెన్సిల్టన్’ సంస్థను స్థాపించారు. పెన్సిల్ కార్డ్ ద్వారా భారతదేశం అంతటా యుక్తవయస్కులు, విద్యార్థుల్లో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు. పెన్సిల్టన్ యాప్ ద్వారా కొన్ని సెకన్లలో రూపే డెబిట్ కార్డ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం వివిధ బ్యాంకింగ్ భాగస్వాములతో కలిసి ఈ కంపెనీ పని చేస్తున్నది.
యువకులు, విద్యార్థులు తమ పాకెట్ మనీ కోసం, ఖర్చుల నిర్వాహణకు ఈ డెబిట్ కార్డ్ను ఉపయోగించవచ్చు. లావాదేవీలన్నింటిని పెన్సిల్టన్ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. ఇది మినీ వెల్త్ మేనేజర్గా పనిచేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి ఈ యాప్ని ఉపయోగించవచ్చు. పేరెంట్ కంట్రోల్స్, ట్రాకింగ్ ఫీచర్ల ద్వారా ఖర్చు పరిమితులు, మనీ రిక్వెస్ట్లను ఆమోదించడం వంటివి సెట్ చేయవచ్చు. కేవైసీ నిబంధనలను తల్లిదండ్రులకే వర్తింపజేస్తుంది. దీని కోసం పెన్సిల్టన్ వారితో నేరుగా సంప్రదింపులు జరుపుతుంది.
పెన్సిల్టన్ సహ వ్యవస్థాపకుడు, మార్కెటింగ్ సీఈవో విశ్వజిత్ పురేటి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మనుషులు చేపట్టే అన్ని ఆర్థిక కార్యకలాపాలకు డబ్బు కేంద్రంగా ఉందని తెలిపారు. అయితే విడ్డూరం ఏమంటే.. దేశంలోని పెద్దలలో ఎక్కువ మంది ఆర్థిక నిరక్షరాస్యులని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని తగ్గించడమే పెన్సిల్టన్ ప్రాథమిక ప్రేరణ అని పేర్కొన్నారు.
పిల్లలు, యువకులు తమ పాకెట్ మనీని సమర్ధవంతంగా వినియోగించుకోవడం, విద్యార్థులలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్వజిత్ వివరించారు. కంపెనీ దృష్టి క్రమంగా ఆర్థిక అక్షరాస్యత నుంచి డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత వైపునకు మళ్లిందన్నారు. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో ఎంగేజ్ అయినట్లు వెల్లడించారు.
డిసెంబర్-జనవరి వ్యవధిలో తమ ప్లాట్ఫారమ్ పూర్తి స్థాయి కమర్షియల్గా రోల్ అవుట్ అవుతుందని విశ్వజిత్ తెలిపారు. అనంతరం ప్రతి రెండు నెలలకు కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని చెప్పారు. ‘మేము యూజర్ బేస్ను నిర్మిస్తున్నాం. ఫిజికల్ కార్డ్ ధర రూ.199. ఎలాంటి అదనపు ఖర్చులు లేవు. మా ఆదాయ వనరులను పెంచుకోవడానికి మరిన్ని ఉత్పత్తులు, ఫీచర్లను జోడిస్తాం. త్వరలో ప్లాట్ఫారమ్లో గిఫ్ట్ ఫీచర్లను కూడా అన్వేషించవచ్చు’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి యువకులు బ్యాంక్ ఖాతా అవసరం లేకుండానే ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్ని ఉపయోగించవచ్చని విశ్వజిత్ తెలిపారు. బ్యాలెన్స్తోపాటు ఖర్చుల వివరాలను వీక్షించవచ్చని చెప్పారు. పిగ్గీ బ్యాంక్ ఫీచర్ కూడా ఉందని, ఇది యువకులకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడే డిజిటల్ వాల్ట్గా పనిచేస్తుందని వివరించారు. దీని ద్వారా తల్లిదండ్రులు పాకెట్ మనీ పంపవచ్చని, అలాగే పిల్లల ఖర్చులను ట్రాక్ చేయవచ్చన్నారు. మరో 2-3 నెలల్లో కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని వెల్లడించారు.
కాగా, ఫిన్టెక్ స్టార్టప్ ‘ఫెన్సిల్టన్’ తన బీటా వెర్షన్ను 2020 డిసెంబర్ 2020లో ప్రారంభించింది. డబ్బు ప్రాముఖ్యతపై యువతరానికి అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. సుమారు 15,000 కుటుంబాలు ఈ కంపెనీ డెబిట్ కార్డ్ని వినియోగిస్తున్నాయి. 2021 మార్చి వరకు కార్డు వినియోగ విధానాలను ఈ కంపెనీ బృందం అంచనా వేసింది.