హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా, వచ్చే పదేండ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాసామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ-డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చికుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.
అందుకే… భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా… బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్య తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని చెప్పారు. గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి.. వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.