న్యూఢిల్లీ, జూలై 20: ఎఫ్ఎంసీజీ దిగ్గజాల్లో ఒకటైన హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,556 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.2,391 కోట్ల లాభంతో పోలిస్తే 6.9 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.14,757 కోట్ల నుంచి రూ.15,679 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.11,531 కోట్ల నుంచి రూ.12,167 కోట్లకు పెరిగాయి. కంపెనీకి వచ్చిన ఆదాయంలో హోమ్ కేర్ విభాగం 10 శాతం వృద్ధిని కనబరుచగా, బ్యూటీ, పర్సనల్ కేర్ 4 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు, నీలమ్ ధావన్ను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించుకున్నది. ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నది.