LIC | న్యూఢిల్లీ, మే 17: కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రతిపాదనల దెబ్బ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై గట్టిగా పడింది. సంస్థ కొత్త ప్రీమియం వసూళ్లలో భారీగా తగ్గాయి. 2023 ఏప్రిల్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం (ఎన్బీపీ) 50.41 శాతం మేర తగ్గి రూ. 5,810 కోట్లకు పడిపోయినట్టు ఒక ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ముఖ్యంగా సింగిల్ ప్రీమియం పాలసీల విక్రయాలు క్షీణించడంతో ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం సగానికి తగ్గింది. ప్రతీ ఏటా కొత్తగా విక్రయించే పాలసీల ద్వారా జరిగే వ్యాపారాన్ని ఎన్బీపీగా వ్యవహరిస్తారు. మొత్తం జీవిత బీమా పరిశ్రమ ఎన్బీపీ ముగిసిన ఏప్రిల్ నెలలో నిరుడు ఇదేనెలతో పోలిస్తే 30 శాతం క్షీణించింది.
అయితే ప్రైవేటు జీవిత బీమా కంపెనీలు 8.5 శాతం వృద్ధి సాధించగలిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5 లక్షలకు పైబడిన బీమా ప్రీమియం చెల్లింపులపై ఆదాయపు పన్ను విధించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అలాగే వివిధ ఇన్సూరెన్స్ పథకాల్లో చేసే పెట్టుబడులకు ఎటువంటి పన్ను మినహాయింపులూ లేని కొత్త పన్ను పద్ధతివైపు ఉద్యోగులు మళ్లే రీతిలో సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎల్ఐసీ ఆదాయానికి గండికొట్టింది. రూ.5 లక్షలకు పైబడిన పాలసీలపై పన్ను వేయడంతో పెద్ద పాలసీలు తీసుకోవడానికి వెనుకంజవేయగా, ఐటి చట్టం సెక్షన్ 80సీ ద్వారా పన్ను ఆదాకు పాలసీలు తీసుకునేవారు కూడా వెనక్కు తగ్గారు.
సింగిల్ ప్రీమియంలో 65 శాతం కోత
ఏప్రిల్ నెలలో ఎల్ఐసీ గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 65.76 శాతం తగ్గుదలతో రూ.2,899.63 కోట్లకు చేరింది. వ్యక్తిగత సింగిల్ ప్రీమియం వసూళ్లు 23 శాతం క్షీణతతో రూ.1,014.47 కోట్లకు తగ్గాయి. అయితే ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ సింగిల్ ప్రీమియం 15 శాతం పెరగ్గా, వాటి గ్రూప్ నాన్-సింగిల్ ప్రీమియం విభాగంలో వసూళ్లు 50.47 శాతం క్షీణించాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ న్యూ బిజినెస్ ప్రీమియం 8 శాతం పెరిగినప్పటికీ, గ్రూప్ సింగిల్ ప్రీమియం 11.4 శాతం, గ్రూప్ నాన్-సింగిల్ ప్రీమియం 59 శాతం చొప్పున తగ్గింది.