న్యూఢిల్లీ, జూలై 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలో పన్నులు భారీగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 41 శాతం వృద్ధితో రూ. 3,54,570 కోట్లకు చేరినట్టు మంత్రి సోమవారం లోక్సభకు తెలిపారు. 2021-22 ఏప్రిల్-జూన్లో ఈ వసూళ్లు రూ.2,50,881 కోట్లుగా ఉన్నాయి.
తాజా త్రైమాసికంలో జీఎస్టీ, కస్టమ్స్ సుంకాలతో సహా నికర పరోక్ష పన్ను వసూళ్లు 9.4 శాతం వృద్ధితో రూ.3,44,056 కోట్లకు పెరిగాయి. నిరుడు ఇదేకాలంలో ఇవి రూ. 3,14,476 కోట్లు. కొవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడం, పన్ను వసూళ్లు మెరుగుపర్చడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపట్టడంతో వసూళ్లు బాగా పెరిగాయని పంకజ్ చౌదరి చెప్పారు.