ముంబై, మే 10: భారత్లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఈ 2022 సంవత్సరంలో ఆర్బీఐ పాలసీ రేట్లను మరో 135 బేసిస్ పాయింట్లు (1.35 శాతం) పెంచవచ్చని అంచనా వేసింది. 2023 రెండో త్రైమాసికానికల్లా రెపో రేటు 6.25 శాతానికి చేరుతుందన్నది. గతవారం ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ఆ రేటు 4.40 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. నోమురా మంగళవారం విడుదల చేసిన నోట్లో అంచనాల ప్రకారం మరో 15 నెలల్లో 1.85 శాతం వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. అయితే 2023 క్యూ2కల్లా రెపో రేటు 5.5 శాతానికి పెరగవచ్చని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో నోమురా తాజా నోట్ను విడుదల చేసింది.
ఆసియాలోకెల్లా అధిక ద్రవ్యోల్బణం
ఆసియా దేశాల్లోకెల్లా భారత్లో ద్రవ్యోల్బణం అధికస్థాయిలో ఉన్నదని, దీంతో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని నోమురా వివరించింది. సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లలో కూడా ద్రవ్యోల్బణం కోరలు చాస్తున్నదని, ఈ దేశాలన్నీ పాలసీ రేట్లను పెంచాల్సి ఉందని పేర్కొంది. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ల్లో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, లక్ష్యానికి లోబడే కొనసాగుతున్నదని తెలిపింది. ఆసియా దేశాల్లోహాంకాంగ్లోనే ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదన్నది.
7.5 శాతానికి సీపీఐ!
ఏప్రిల్ నెలలో దేశంలో వినిమయ ధరల సూచీ (సీపీఐ) వృద్ధిరేటు 18 నెలల గరిష్ఠం 7.4 శాతానికి చేరవచ్చని రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు. రిటైల్ ద్రవ్యోల్బణంగా వ్యవహరించే సీపీఐ మార్చి నెలలో 6.95 శాతం పెరిగింది. ఏప్రిల్లో ఈ ద్రవ్యోల్బణం రేటు మరిం త దూకుడు ప్రదర్శిస్తుందని మే 5-9 తేదీల మధ్య రాయిటర్స్ పోల్లో పాల్గొన్న ఆర్థికవేత్తలు అంచ నా వేశారు. వంటనూనెలు, ఇంధనాల ధరలు పెరగడం, వివిధ కంపెనీలు.. ముడిపదార్థాల వ్యయ భా రాన్ని వినియోగదారులకు మళ్లించడం, సర్వీసుల రంగం సైతం ఛార్జీలను పెంచడంతో ఏప్రిల్లో సీపీఐ గరిష్ఠస్థాయికి చేరుతుందని రాయిటర్స్ పోల్ తెలిపింది. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మే 12 గురువారం వెలువడవచ్చు.