LIC | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఒక్కసారి మీ ఎల్ఐసీ పాలసీ గడువు తీరిపోతే.. మెచ్యూరిటీ నగదు మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు ఇందుకోసం క్లెయిమ్ చేసుకోవాలి. ఆన్లైన్లోనూ ఈ మెచ్యూరిటీ క్లెయిమ్ను దాఖలు చేయవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇందుకు వీలున్నది.
పాలసీదారులు ఏం చేయాలి?
ముందుగా పాలసీదారులు తమ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా సూచిస్తున్నది. అలాగే పాలసీ సొమ్మును పొందేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్)ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఎండోమెంట్ మెచ్యూరిటీ క్లెయిమ్స్
ఎండోమెంట్ పాలసీల్లో గడువు తీరిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. ఈ మేరకు పాలసీ వ్యవధి పూర్తవడానికి కనీసం రెండు నెలల ముందైనా సంస్థ తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. కావాల్సిన పత్రాలను సమర్పిస్తే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమవుతుంది. పూర్తయిన డిశ్చార్జీ ఫామ్, పాలసీ డాక్యుమెంట్, నెఫ్ట్ ఫామ్, కేవైసీ వంటివి అవసరం.
మనీ-బ్యాక్ పాలసీల్లో..
రూ.5 లక్షలదాకా మొత్తా ల చెల్లింపులకు పాలసీ డాక్యుమెంట్తో పనిలేదు. జీవన్ ఆనంద్ ప్లాన్ కింద రూ.2 లక్షల వరకు కూడా పాలసీ బాండ్ల అవసరం లేదు. ఈ రకమైన పాలసీల్లో పాలసీ వ్యవధి మొత్తంగా నగదు భరోసా ఉంటుంది. కాలానుగుణ చెల్లింపులుంటాయి.
డెత్ క్లెయిమ్లు
బకాయిల్లేకుండా ప్రీమియంలు చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ వ్యవధిలోనే మరణం సంభవించాలి. అలాగే క్లెయిమ్ ఫామ్ ఏలో క్లెయిమ్ చేస్తున్నవారు మృతుల వివరాలన్నింటినీ పేర్కొనాలి. డెత్ సర్టిఫికెట్ను సమర్పించాలి. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ పాలసీదారుని వయసు పేర్కొనకపోతే ఏజ్ సర్టిఫికెట్ అవసరం.