US-Israeli war : ఇరాన్అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. ఇండియాలో వరుసగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అసలు ఎల్పీజీ సిలిండర్లు దొరకడమే కష్టమైపోయింది. ఇదంతా ఇప్పుడు సామాన్యుడిపై పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీనికి పశ్చిమాసియా యుద్ధంతోపాటు అనేక కారణాలున్నాయి.
ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఇటీవల ఆర్బీఐ వేసిన అంచనాలు, ఈ ఏడాది సాధారణ వర్షపాతం, ఎల్నినో ప్రభావం, రూపాయి బలహీనపడటం వంటివి అన్నీ కలిపి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. చమురు ధరలు పెరగడం కారణంగా ముడి సరుకు ధరలు పెరిగి, ఫలితంగా ఆహార తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అలాగే, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. దీనివల్ల కలిగే నష్టాన్ని కంపెనీలు వినియోగదారులపైకి మళ్లిస్తున్నా. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల ధరలు పెంచుతున్నాయి. లేదా వస్తువుల పరిమాణం తగ్గిస్తున్నాయి. అన్నిరంగాలపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.
ముఖ్యంగా ముడిసరుకుల ధరలు, రవాణా చార్జీలు పెరగడం సమస్యగా మారింది. ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయి. ఇందుకు అవసరమైన ముడిసరుకులైన ప్లాస్టిక్ ర్యాపర్లు, అట్టలు వంటివి, ఇతర ఉత్పత్తులు కూడా విదేశాల నుంచి రావాలి. వీటి ధరలు కూడా పెరుగుతుండటం కంపెనీలకు భారంగా మారింది. విదేశాల నుంచి రావాల్సిన అనేక సరుకుల రవాణా నిలిచిపోవడం పెద్ద సవాలుగా మారింది. వీటన్నింటినీ ముందుగా ఎదుర్కునేందుకు సిద్ధమైనవి ఎఫ్ఎంసీజీ కంపెనీలే. హిందుస్తాన్ యునీలీవర్, గోద్రేజ్, డాబర్ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే స్వల్పంగా తమ ఉత్పత్తుల ధరలు పెంచాయి.
అలాగే బ్రిటానియా వంటి సంస్థలు తమ ఉత్పత్తుల బరువు, పరిమాణం తగ్గిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.20 వరకు ఉండే వస్తువుల ధరలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వీటి ధరలు పెంచడం ఆయా కంపెనీలకు అంత లాభదాయకం కాదు. అందుకే ఉత్పత్తుల బరువు తగ్గించాలని చూస్తున్నాయి. దీన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత సంక్షోభం కారణంగా దేశంలో ఆటోమొబైల్ ఉత్పత్తులైన బైకులు, కార్లపై కూడా పడుతోంది. వాహనాల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. విమానాల ఫ్యుయెల్ ధరలు పెరగడంతో చాలా సంస్థలు విమాన సర్వీసుల్ని నిలిపివేశాయి.
ఇదే సమయంలో కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సిబ్బందికి అనవసర ప్రయాణాల్ని నిలిపివేసింది.అలాగే, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఖర్చుల్ని కూడా కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు పెరిగిన ఈ ఖర్చుల్ని తమ వినియోగదారులపైకి మళ్లిస్తున్నాయి. దీంతో సామాన్యుడు ఇబ్బందిపడుతున్నాడు.