పెట్టుబడి సాధనాల్లో పోస్టాఫీసు పత్రాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని, రిస్క్ లేకుండా వడ్డీ సైతం లభిస్తుందని తెలిసిందే. అయితే కొద్ది సంవత్సరాలుగా వీటి వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఐదేండ్ల డిపాజిట్పై 6.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా, ప్రైవేటు బ్యాంక్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. అన్ని బ్యాంక్ల వడ్డీ రేట్లను పరిశీలించి, తమకు అనువైన బ్యాంక్ను ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
డిపాజిట్పై ఇన్సూరెన్స్
బ్యాంక్ వైఫల్యం చెందినా రూ.5 లక్షల పరిమితి వరకూ ఫిక్స్డ్ డిపాజిట్పై మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. క్యుములేటివ్ డిపాజిట్ (కాలపరిమితి ముగిసిన తర్వాత వడ్డీ, అసలు చెల్లించేది) అయితే బ్యాంక్ విఫలమయ్యే నాటికి వడ్డీతో కలిపి రూ.5 లక్షల మొత్తాన్ని మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చెల్లిస్తుంది. అంతకు మించిన మొత్తాన్ని చెల్లించదు. నాన్-క్యుములేటివ్ (విడతలవారీగా వడ్డీ చెల్లించేది) అయితే రూ.5 లక్షల వరకూ చేసే డిపాజిట్పై పూర్తి బీమా లభిస్తుంది.