NDTV to Adani | గౌతం అదానీ.. అదానీ గ్రూప్ చైర్మన్.. ఆధునిక భారతంలో సంపన్న పారిశ్రామికవేత్త.. ఒక రంగం నుంచి మరో రంగంలోకి వడివడిగా దూసుకెళ్తున్న గౌతం అదానీ కన్ను… దేశంలోనే పేరెన్నికగన్న టీవీ న్యూస్ చానెల్.. ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్)పై పడింది. ఎన్డీటీవీకి రుణం ఇచ్చిన సంస్థను టేకోవర్ చేసింది అదానీ గ్రూప్.. అలా రుణం ఇచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్)కు ఏ క్షణంలోనైనా వాటాలుగా కన్వర్ట్ చేసుకునేందుకు వీలుగా ఎన్డీటీవీ ప్రమోటర్లు బాండ్లు జారీ చేశారు. ఆ వీసీపీఎల్ను టేకోవర్ చేసిన అదానీ గ్రూప్.. ఆ సంస్థకు ఎన్డీటీవీ ఇచ్చిన బాండ్లను వాటాలుగా మార్చుకున్నది.
ఎన్డీటీవీకి వీసీపీఎల్ ఇచ్చిన రుణం రూ.403. 85 కోట్లు. సంస్థలో 29.18 శాతం వాటాతో సమానం. దీనికితోడు ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి అదానీ ఓపెన్ ఆఫర్ జారీ చేయనున్నది. అలా ఓపెన్ ఆఫర్లో 26 శాతం వాటాను కూడా అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తే ఎన్డీటీవీ కూడా గౌతం అదానీ సొంతం కానున్నది. ఎన్డీటీవీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్డీటీవీ ఇంగ్లిష్, ఎన్డీటీవీ హిందీ, ఎన్డీటీవీ ప్రాఫిట్ చానెల్స్ నిర్వహిస్తున్నది. కానీ, వాటాల కొనుగోలు సంగతి తమకు చెప్పలేదని ఎన్డీటీవీ ఫౌండింగ్ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికారాయ్ చెబుతున్నారు.
ఎన్డీటీవీ ప్రమోటర్స్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్లో ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ప్రమోటర్లు. 2009 జూన్ నాటికి వీరికి సంస్థలో 55.5 శాతం వాటా ఉంది. తొలుత ఆర్ఆర్పీఆర్కు ఎన్డీటీవీలో కేవలం 7.56 శాతం వాటా మాత్రమే ఉండేది. ప్రణయ్ రాయ్, రాధికారాయ్ల ఆధీనంలోని ఆర్ఆర్పీఆర్ సంస్థ.. రెండు దఫాలుగా వీసీపీఎల్ నుంచి రుణం తీసుకుంది. 2009లో రూ.350 కోట్లు, 2010లో రూ.53 కోట్ల రుణం తీసుకున్నది. రుణం తీసుకున్నప్పుడు ప్రణయ్ రాయ్, రాధికారాయ్ తమ వాటాలను ఆర్ఆర్పీఆర్కు బదిలీ చేయాలని ఒప్పందంలో నిబంధన చేర్చారు. దీంతో ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్ వాటా 29.18 శాతానికి పెరిగింది.
అలాగే వీసీపీఎల్ తాను ఇచ్చిన రుణం ఎప్పుడైనా వాటాగా మార్చుకునేలా ఒప్పందంలో చేర్చడంలో సఫలమైంది. దీని ఆసరాగా తొలుత వీసీపీఎల్లో 100 శాతం వాటాలను అదానీ గ్రూప్ అనుబంధ ఎఎంజీ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. అటుపై ఎన్డీటీవీలోని ఆర్ఆర్పీఆర్కు వీసీపీఎల్ ఇచ్చిన రుణం వాటాగా మార్చేసుకుంది అదానీ గ్రూప్. ఇప్పుడు ఇక రాధికారాయ్, ప్రణయ్ రాయ్లకు 32.26 శాతం వాటా మాత్రమే ఉండనున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి అత్యంత సన్నిహితుడిగా గౌతం అదానీకి పేరుంది. చట్టంలో ఉన్న నిబంధనల్లో లొసుగుల ఆధారంగా అన్ని రంగాల పరిశ్రమలను టేకోవర్ చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.