House Sales | రోజురోజుకు సొంతింటికి గిరాకీ పెరగడంతో ప్రతియేటా సగటున 38 శాతం ఇండ్ల విక్రయాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో అధిక సంఖ్యలో ఇండ్లు అమ్ముడు పోయాయి. సొంతింటికి గిరాకీతోపాటు నిర్మాణ ఖర్చులకు అనుగుణంగా వాటి ధరలు పెరుగుతున్నాయి. లగ్జరీ ఇండ్లకూ అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్నదని ప్రముఖ రియాల్టీ సంస్థ అనరాక్ తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అమ్ముడైన ఇండ్ల విలువ రూ.4.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లో గతేడాది 3,26,877 కోట్ల ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే అంటే జనవరి-సెప్టెంబర్ మధ్య 3,48,776 కోట్ల ఇండ్లు అమ్ముడయ్యాయి. అంటే 2022తో పోలిస్తే ఏడు శాతం గ్రోత్ నమోదైంది.
‘గతేడాది రికార్డులను తొలి తొమ్మిది నెలల్లోనే ఇండ్ల విక్రయాలు అధిగమించాయి. మరోవైపు ప్రీమియం లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరుగుతున్నది. ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల ధరలు సగటున 8-18 శాతం పెరిగాయి’ అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో రూ.1,12,976 కోట్ల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయి. రెండో త్రైమాసికంలో ఒకశాతం, మూడో త్రైమాసికంలో ఎనిమిది శాతం పెరిగాయన్నారు. ఫెస్టివ్ సీజన్ తోపాటు చివరి త్రైమాసికంలోనూ సేల్స్ మరింత పెరుగుతాయని అనూజ్ పూరీ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఇండ్ల విక్రయాల విలువ రూ.4.5 లక్షల కోట్లను దాటేస్తుందని స్పష్టం చేశారు.
జనవరి-సెప్టెంబర్ మధ్య పుణెలో మొత్తం అమ్ముడైన ఇండ్ల విలువ 96 శాతం పెరిగి రూ.39,945 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇదే కాలంలో రూ.20,406 కోట్లు మాత్రమే. చెన్నైలో 45 శాతం గ్రోత్ నమోదైంది. 2022లో చెన్నైలో ఇండ్ల విక్రయాల విలువ రూ.7825 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.11,374 కోట్లకు పెరిగాయి. మరోవైపు తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలో 43 శాతం ప్రగతి రికార్డైంది. గతేడాది రూ.25,001 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది రూ.35,802 కోట్లకు దూసుకెళ్లింది.
బెంగళూరులో 42 శాతం గ్రోత్తో రూ.27,045 కోట్ల నుంచి రూ.38,517 కోట్లకు పుంజుకున్నాయి. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలో 41 శాతం పురోగతితో రూ.1,16,242 కోట్ల నుంచి రూ.1,63,517 కోట్లకు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో 29 శాతం ఎదుగుదలతో రూ.38,895 కోట్ల నుంచి రూ.50,188 కోట్లు దూసుకెళ్లాయి. ఇక కోల్కతాలో 19 శాతం గ్రోత్ రికార్డయింది. గతేడాది రూ.7,612 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది రూ.9,025 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగాయి.