Credai on Home Rates | ఇండ్ల నిర్మాణ వ్యయం పెరుగుతున్నదా.. మున్ముందు ఇండ్ల ధరలు పెరగనున్నాయా.. అంటే అవుననే అంటున్నది రియల్టర్స్ అపెక్స్ బాడీ క్రెడాయ్. గత ఏడాది కాలంగా సిమెంట్, స్టీల్ ధరలు పెరిగిపోవడం పట్ల మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ముడి సరుకుల ధరలు తగ్గకపోతే ఇండ్ల ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నది.
ఈ పరిస్థితుల్లో ఇండ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని క్రెడాయ్ డిమాండ్ చేసింది. అలాగే నిర్మాణ ముడి సరుకుపై జీఎస్టీని కూడా తగ్గించాలని కోరింది. దేశవ్యాప్తంగా 13వేల మందికి పైగా డెవలపర్లు సభ్యులుగా ఉన్న సంస్థే కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్). 2020 జనవరి నుంచి ఇండ్ల నిర్మాణానికి ఉపయోగించే ముడి సరుకు ధరలు నిరంతరం పెరుగుతున్నాయని గుర్తు చేసింది.
దీనికితోడు కరోనాను నియంత్రించడానికి విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూల వల్ల కార్మికుల కొరత వల్ల ఇండ్ల నిర్మాణంలో జాప్యానికి దారి తీసిందని పేర్కొంది. ఫలితంగా ఇండ్ల నిర్మాణం 18 నెలలుగా 10-15 శాతం పెరిగిందని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష్ వర్దన్ పటోడియా తెలిపారు. సమీప భవిష్యత్లో ముడి సరుకు ధరలు తగ్గించకపోతే ఇండ్ల ధరలు 10-15 శాతం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
పెరిగిన ఇండ్ల నిర్మాణ ఖర్చులు కొనుగోలుదారులపై మోపక తప్పదని స్ఫష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ముడి సరుకు ధరలు తగ్గించడానికి ప్రభుత్వం, సంబంధిత శాఖలు తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పెసిలిటీ కల్పించడం గానీ, జీఎస్టీని హేతుబద్ధీకరించడం గానీ చేయాలని కోరారు.