న్యూఢిల్లీ: రెండేండ్ల క్రితం రుణాల ఊబిలో చిక్కుకుని నేలకు పరిమితమైన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తిరిగి ఆరు నెలల్లో సర్వీసులు ప్రారంభించనున్నది. ఈ సంగతి దుబాయి కేంద్రంగా పని చేస్తున్న ఎంటర్ప్రెన్యూర్ మురారీ లాల్ జలాన్ చెప్పారు. నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించిన వెంటనే సర్వీసులు ప్రారంభిస్తుందన్నారు. ఎన్సీఎల్టీ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందన్నారు మురారీ లాల్ జలాన్.
‘ఒకసారి ఎన్సీఎల్టీ క్లియరెన్స్ లభిస్తే చాలు. సాధ్యమైనంత త్వరగా ఎన్సీఎల్టీ ఆమోదం లభిస్తుందని మేం ఆశాభావంతో ఉన్నాం. విమాన సర్వీసులు ఎంచుకునేందుకు ఎన్సీఎల్టీ నిర్ణయం చాలా ముఖ్యం. పూర్తిస్థాయి విమానయాన సంస్థగా సేవలందిస్తుంది’ అని జలాన్ తెలిపారు.
గతేడాది జలాన్, లండన్ కేంద్రంగా పని చేస్తున్న కాల్రాక్ క్యాపిటల్ సంస్థ సంయుక్తంగా బిడ్ గెలుచుకున్నాయి. రుణాల ఊబిలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ 2019 ఏప్రిల్లో నేలకు పరిమితం అయింది. ఐదేండ్లలో కరోనా ముందు స్థాయిలో విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తామని మురారీ లాల్ జలాన్ వెల్లడించారు.