Home Prices | కరోనా తర్వాత సొంతింటి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి తోడు కీలక వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. కానీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇండ్ల ధరలు పెంచేందుకు రియాల్టీ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్ బాడీ క్రెడాయి ప్రతినిధులు వచ్చే నెలలో ఇండ్ల ధరలు 10-15 శాతం పెరుగుతాయని చెబుతున్నారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల అన్ని రకాల ముడి సరుకు ధరలు పెరిగిపోయాయి. ఇండ్ల నిర్మాణంలో కీలకంగా వినియోగించే సిమెంట్, స్టీల్, రాగి, అల్యూమినియం, ఇతర భవన నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఇండ్ల నిర్మాణ వ్యయం 12 శాతం పెరిగిందని కూలియర్స్ అనే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది.
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు స్టీల్ ధరలు 30 శాతం పెరిగితే, సిమెంట్ ధర 22 శాతం పైపైకి దూసుకెళ్లింది. రాగి ధర 40, అల్యూమినియం ధర 44 శాతం ఎక్కువైందని కూలియర్స్ తెలిపింది. దీనివల్ల మొత్తం ఇండ్ల నిర్మాణం ఖర్చు సుమారు మూడింట రెండొంతులు పెరిగిందని రియాల్టీ డెవలపర్లు చెబుతున్నారు. కొన్నేండ్లుగా రియాల్టీ డెవలపర్ల లాభాలు కొద్దిమొత్తంగానే ఉంటున్నాయి.
తాజాగా స్టీల్, సిమెంట్, రాగి తదితర నిర్మాణ రంగ ముడి సరుకుల ధరల ప్రభావం ఇండ్ల ధరలపై పడుతుందని కూలియర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో రమేశ్ నాయర్ చెప్పారు. చౌకధర, మధ్య తరగతి ఇండ్ల ధరలు పెరగనున్నాయని సంకేతాలిచ్చారు. వచ్చే డిసెంబర్ నాటికి ఇండ్ల నిర్మాణ ఖర్చులు 8-9 శాతం పెరుగుతాయని అంచనా వేశారు.