Home Loan | ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోతున్న ధరలకు కళ్లెం వేసేందుకు గతేడాది ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెరిగాయి. ప్రత్యేకించి వడ్డీ రేట్లు పెరగడంతో ఇండ్ల రుణాల ఈఎంఐ లేదా రుణం చెల్లింపు గడువు (టెన్యూర్) పెరిగిపోతూ వచ్చింది. ఇది ఇంటి రుణ గ్రహీతలకు ఇబ్బందికరంగా మారింది. కొందరు రుణ గ్రహీతలు తమ రిటైర్మెంట్ పూర్తయ్యే వరకూ ఇంటి రుణం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
వడ్డీరేట్లు పెరిగినప్పుడు బ్యాంకర్లు సాధారణంగానే ఇండ్ల రుణాలపై నెలసరి వాయిదా (ఈఎంఐ)లు పెంచేస్తారు. సుదీర్ఘకాలం ఈఎంఐ పొడిగించడం వల్ల ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రుణ గ్రహీతల బాధలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. రుణ గ్రహీతలకు తమ రుణాలపై వడ్డీలను రీసెట్ చేసుకునేందుకు అధికారం కల్పించింది.
ఈ విషయమై గత నెల 18న ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం వడ్డీరేట్లు పెరిగినప్పుడు ఈఎంఐలు పెంచుకోవాలా.. లోన్ టెన్యూర్ పెంచుకోవాలా అన్నది రుణ గ్రహీతలే నిర్ణయించుకోవాలి. రెండు ఆప్షన్లు కూడా ఉపయోగించుకోవడంతోపాటు ఫ్లోటింగ్ లేదా ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్ ఖరారు చేసుకునే ఆప్షన్ కూడా రుణ గ్రహీతకు కల్పించాలని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో సూచించింది. ఫిక్స్డ్ వడ్డీరేట్ రీసెట్ చేసుకుని రుణం మార్చుకుంటే ప్రాసెసింగ్ ఫీజు భారం పడుతుందని సంబంధిత కస్టమర్లకు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు 2020లో 20 ఏండ్ల టెన్యూర్ (240 నెలలు) తో ఏడు శాతం వడ్డీపై రూ.50 లక్షలు ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం.. ఇంటి రుణం తీసుకునే టైంలో మీ నెలవారీ ఈఎంఐ రూ.38,675. దీని ప్రకారం ఓవరాల్ వడ్డీ రూ.43.04 లక్షలు.
మూడేండ్ల తర్వాత వడ్డీరేటు 9.25 శాతానికి పెరిగింది. తాజా ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం రుణ గ్రహీత.. లోన్ టెన్యూర్ లేదా ఈఎంఐ పెంచుకునే ఆప్షన్తోపాటు ఫిక్స్డ్ లేదా ఫ్లోటింగ్ ఇంటరెస్ట్ రేట్ రీసెట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
మీ రుణం చెల్లింపు గడువు 17 ఏండ్లు మాత్రమే ఉంది. వడ్డీరేట్ల పెరుగుదలకు అనుగుణంగా మీ నెలవారీ ఈఎంఐ రూ.44,978 పలికితే.. మొత్తం రుణం చెల్లించే నాటికి రూ.55.7 లక్షల వడ్డీ పే చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు మీ ఈఎంఐ యధాతథంగా రూ.38,765 కొనసాగించాలని భావిస్తే లోన్ టెన్యూర్ 321 నెలలు (26 సంవత్సరాల 10 నెలలు) రుణం చెల్లించాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.88.52 లక్షల లోన్ పే చేయాలి. ఈఎంఐ పెంచుకోకుండా ఎక్కువ టెన్యూర్ పొడిగిస్తే రూ.33 లక్షలు అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.