Homes | కరోనా మహమ్మారి ముప్పు దాటేశాం.. దాని ప్రభావంతో వస్తువుల ధరలు కొండెక్కాయి.. ధరలను నియంత్రించడానికి బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేశాయి. ధరలు ప్లస్ వడ్డీరేట్ల పెంపుతో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల ధరలు పెరిగాయి. అయినా సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఇండియన్లు వెనుకాడటం లేదని తేలింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సగటున ఆరు శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఎంఆర్, కోల్కతా, పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల పరిధిలో ధరలు ఎక్కువయ్యాయి. ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో ఇండ్ల ధరలు గరిష్టంగా 14 శాతం పెరిగాయని క్రెడాయ్-కొల్లియర్స్-లియాయిసెస్ ఫొరాస్ హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ చెప్పింది.
వడ్డీరేట్లు పెరిగినా, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైనా ఈ ఏడాది ప్రారంభం నుంచే కొత్త ఇండ్ల ప్రాజెక్టులను రియాల్టీ డెవలపర్లు ప్రారంభించేస్తున్నారు. భారీగా ధరలు పెరిగినా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్ముడు పోని ఇండ్లు కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నాయి. మెజారిటీ నగరాల్లో అమ్ముడవ్వని ఇండ్ల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండ్లలో మాత్రమే 94 శాతం అమ్ముడు కాలేదని ఈ నివేదిక చెబుతున్నది.
బెంగళూరులో గరిష్టంగా 14 శాతం అమ్ముడు పోని ఇండ్లు ఉన్నాయి. హైదరాబాద్తోపాటు ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), అహ్మదాబాద్ నగరాల పరిధిలో అమ్ముడు పోని ఇండ్లు పెరుగుతూ ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 37 శాతం, ఎన్సీఆర్, పుణెలు 13 శాతం చొప్పున ఇండ్లు అమ్ముడు పోలేదు.
కరోనా మహమ్మారితో తలెత్తిన ఆర్థిక అనిశ్చితి నుంచి 2022లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కొల్లియర్స్ సీఈవో (ఇండియా)- ఎండీ (ఆసియా) రమేశ్ నాయర్ చెప్పారు. ధరలు, ఇన్పుట్ కాస్ట్ వ్యయం పెరుగుదలతో దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయన్నారు. ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నా దేశంలోని 8 ప్రధాన నగరాల పరిధిలో సొంతిండ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉందని రమేశ్ నాయర్ స్పష్టం చేశారు.