HUL Price Hike | ముందే అంచనా వేసినట్లు నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మరోమారు లక్స్ మినహా వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలు 3-20 శాతం పెంచేసింది. ధరల పెంపు విషయమై స్పందించేందుకు హెచ్యూఎల్ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. హెచ్యూఎల్ ఇంతకుముందు గత నవంబర్లోనే 33 శాతం వరకు పెంచింది. ఇతర సంస్థలు కూడా గతేడాది పలు దఫాలు ముడి సరుకు ధరలు, ఇన్పుట్ కాస్ట్ పెరిగిందంటూ పెంచేశాయి. తాజాగా హెచ్యూఎల్ వివిధ ఉత్పత్తుల ధరలను మూడు నుంచి 20 శాతం పెంచేసింది. హెచ్యూఎల్ బాటలోనే ప్రయాణించేందుకు ఇతర సంస్థలూ సిద్ధం అవుతున్నాయి.
అత్యధికంగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు ధర రూ.10 నుంచి రూ.12 (20 శాతం)
125 గ్రాముల లైఫ్భాయ్ సబ్బు ధర రూ.29 నుంచి రూ.31
500 గ్రాముల వీల్ పౌడర్ ధర రూ.30 నుంచి 31. కిలో వీల్ పౌడర్ ధర రూ.60 నుంచి రూ.62.
125 గ్రాముల పియర్స్ సబ్బు ధర రూ.76 నుంచి 83.
రిన్ (నాలుగు 250 గ్రాముల బార్లు) బండిల్ ధర రూ.72 నుంచి 76.
250 గ్రాముల సింగిల్ రిన్ బార్ ధర రూ.18 నుంచి రూ. 19.
ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో జనవరిలో ప్యాకేజ్డ్గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం ధర 8-10 శాతం పెంచుతామని గతనెలలోనే అదానీ విల్మార్ తెలిపింది. పార్లె తన ఉత్పత్తుల ధరలు 4-5 శాతం పెంచుతామని వెల్లడించింది. ఇంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ పెంచివేసింది. డాబర్ ఇండియా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం అసాధారణ రీతిలో తొమ్మిది శాతానికి పైగా పెరిగిందన్న డాబర్ ఇండియా.. ఇంతకుముందే 3-4 శాతం ధరలు పెంచింది. కెవిన్కారే తన షాంపో, స్కిన్ కేర్ ఉత్పత్తుల ధరలు 2-3 శాతం పెంచుతామని ప్రకటన చేసింది.