సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): భారత దేశ ఏరోస్పేస్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకుగాను టీ హబ్తో జత కట్టింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్). శుక్రవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో టీ హబ్ సీఈవో ఎంఎస్ రావుతో హెచ్ఏఎల్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రావు మాట్లాడుతూ..హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఏరోస్పేస్ రంగంలో ఉన్న స్టార్టప్లకు మేలు జరగనున్నదన్నారు. ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందన్న ఆయన.. స్టార్టప్లకు కొత్త అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. హెచ్ఏఎల్ డైరెక్టర్ డీకే సునీల్ మాట్లాడుతూ.. భారత్లో బలమైన స్టార్టప్ ఏకోసిస్టమ్ ఉన్నదన్నారు. ఇన్నోవేషన్ వర్క్షాప్లు, నూతన సాంకేతికతతో నడిచే స్టార్టప్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.