NSE Chitra | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఫ్రాడ్ కేసులో సంస్థ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ సంభాషణలు జరిపిన యోగి ఎవరన్నదానిపైనే అందరి దృష్టి పడింది. ఎన్ఎస్ఈలో ఏండ్ల తరబడి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆ యోగి ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ వర్గాలు మాత్రం సదరు యోగి.. హిమాలయాలకు చెందిన యోగి గానీ, ఏదేనీ బాబా గానీ కాదని విశ్వసిస్తున్నాయి. చిత్ర రామకృష్ణ కెరీర్ ఉజ్వలంగా ఎదగడానికి కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఫైనాన్స్ మినిస్టీ అధికారే ఆ యోగి అని అనుమానాలు ఉన్నాయి.
ఒకవేళ సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప కొన్ని విషయాలు బయటకు రావని చెబుతున్నారు. లేని పక్షంలో ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ మాదిరిగానే యోగిని పట్టుకోవడం కష్ట సాధ్యం అవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసులో మరికొందరు ఎన్ఎస్ఈ అధికారులను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ వర్గాల కథనం. 2015లో కో-లొకేషన్ స్కామ్ వెలుగు చూసినప్పుడు ఎన్ఎస్ఈ మీద ఫైన్ విధించి సెబీ మౌనంగా ఉండి పోయింది.
యోగి సూచన మేరకే ఆనంద్ సుబ్రమణ్యన్ను చిత్రా రామకృష్ణ.. ఎక్స్చేంజ్ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్గా నియమించి.. గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్గా.. ఎండీకి సలహాదారుగా ప్రమోషన్లు కల్పించింది. యోగి-చిత్ర రామకృష్ణ ఈ-మెయిల్స్లోనూ ఆనంద్ ప్రస్తావన ఉండేది. ఈ తరుణంలో సదరు యోగి.. ఆనంద్ సుబ్రమణ్యన్ అయ్యే అవకాశాలు తక్కువ.. ఆర్థికశాఖ అధికారే యోగిలా వ్యవహరించాడా? అన్న ఆరోపణలు ఉన్నాయి. 20 ఏండ్ల క్రితం యోగిని కలుసుకున్న చిత్రా రామకృష్ణకు ఆయన పూర్తి పేరు తెలియదు. ఈ-మెయిల్ ఐడీ అడ్రస్ rigyajursama@outlook.com అని ఉంది. తనకు మార్గదర్శనం చేసిన యోగి పరమహంస అని చిత్ర రామకృష్ణ చెప్పినట్లు సీబీఐ, సెబీ వర్గాల కథనం.