Apple-CERT-IN |ఇటీవల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. తాజాగా ఆపిల్ ఉత్పత్తుల యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. పలు ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నదని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ – కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. తత్ఫలితంగా యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కనుక ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు వాటిలో సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాలని హితవు చెప్పింది.
ఐ-ఫోన్, ఆపిల్ వాచ్, ఆపిల్ మ్యాక్ బుక్, ఐ-పాడ్, ఆపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్తోపాటు సఫారీ బ్రౌజర్ లోనూ ఈ సెక్యూరిటీ లోపాలున్నాయని సెర్ట్ఇన్ తెలిపింది. ఆపిల్ ఉత్పత్తుల్లో ఈ లోపాలను గుర్తించి హ్యాకర్లు చొరబడి సెక్యూరిటీ పాస్వర్డ్లను బైపాస్ చేసి యూజర్ల సున్నితమైన సమాచారం దొంగిలించగలరని హెచ్చరించింది.
ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వర్షన్లు, మ్యాక్ ఓఎస్ సోనోమా 14.2, వెంట్యూరా 13.6.3, మానిటరీ 12.7.2, ఆపిల్ టీవీ ఓఎస్ 17.2, ఆపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వర్షన్లలో లోపాలు ఉన్నాయని గుర్తించామని సెర్ట్ ఇన్ వెల్లడించింది.