న్యూఢిల్లీ, మార్చి 30: తమ ఖాతా పుస్తకాల్లో రూ. 1,000 కోట్లకుపైగా బోగస్ ఖర్చుల్ని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) కనుగొన్నట్టు మీడియాలో వెలువడిన వార్తలు ఊహాజనితమేనని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లోని హీరో మోటోకార్ప్ కార్యలయాలు, ఆ సంస్థ సీఎండీ పవన్ ముంజాల్ ఇండ్లపై ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ డాటా ద్వారా రూ.1,000 కోట్లకుపైగా నకిలీ నగదు వ్యయాలకు సంబంధించి అధికారులకు ఆధారాలు లభించినట్టు వచ్చిన వార్తలపై స్టాక్ ఎక్సేంజీలు కంపెనీని వివరణ కోరాయి. ఇందుకు హీరో మోటో బదులిస్తూ గతవారం తనిఖీకి వచ్చిన ఐటీ అధికారులకు అవసరమైన డాక్యుమెంట్లు, డాటాను ఇచ్చామని, ఇక ముందు సైతం అందచేస్తామని తెలిపింది. ఆయా పత్రాలు, డాటాలో ఐటీ శాఖ కనుగొన్న అంశాల్ని తమకు తెలియపరిస్తే, ఆ సమాచారాన్ని ఎక్సేంజీలకు ఇస్తామని కంపెనీ పేర్కొంది. తమ ప్రకటిత ఆర్థిక ఖాతాలన్నీ ఆడిట్ అయ్యాయని తెలిపింది. మార్చి 23నుంచి 26 వరకూ ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లోని హీరో మోటోకార్ప్ కార్యలయాలు, ఆ సంస్థ సీఎండీ పవన్ ముంజాల్ ఇండ్లపై ఐటీ శాఖ సోదా లు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 40 ఆవరణల్లో ఈ సోదాలు జరిగాయి. హీరో గ్రూప్ బోగస్ కొనుగోళ్లు జరిపినట్లు దాడుల్లో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ డాటా ద్వారా వెల్లడయ్యిందని, రూ. 1,000 కోట్లకుపైగా నకిలీ నగదు వ్యయాలకు సంబంధించి ఖాతాల్లో ఎంట్రీలు వేసినట్టు ఆధారాలు లభించినట్టు సంబంధిత వర్గాల్ని ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. బోగస్ ఖర్చుల వార్తలతో క్రితం రోజు బీఎస్ఈలో 7 శాతం పతనమైన హీరో మోటో కార్ప్ షేరు బుధవారం 2.85 శాతం మేర కోలుకుని రూ.2,272 వద్ద ముగిసింది.