Hero Karizma XMR 210 | దేశంలోనే అతిపెద్ద టూవీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ ధర పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రూ.7000 పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ధర పెంచడానికి కారణాలను హీరో మోటో కార్ప్ వెల్లడించలేదు. ప్రస్తుతం హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ ప్రారంభ ధర రూ.1,72.900 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పెంచిన ధరతో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 ధర రూ.1,79,900 (ఎక్స్ షోరూమ్)కు పెరుగుతుంది. ప్రస్తుత ధరకే ఈ నెల 30 అర్ధరాత్రి వరకూ బుకింగ్స్ విండో తెరిచే ఉంటుందని హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తెలిపింది.
ఆసక్తిగల మోటారు సైకిళ్ల ప్రియులు హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) డీలర్ షిప్ల వద్ద, అధికారిక వెబ్ సైట్లోనూ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 (Hero Karizma XMR 210) బైక్ బుక్ చేసుకోవచ్చు. `7046210210` ఫోన్ నంబర్కు ఫోన్ చేసి కూడా బైక్ బుక్ చేసుకోవచ్చు. అయితే, రూ.3000 టోకెన్ సొమ్ము పే చేయాల్సి ఉంటది. సవరించిన ధరతో హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ల నూతన బుకింగ్ విండో తేదీ త్వరలో ప్రకటిస్తారు.