న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పలు సంస్థల విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ నెలను ‘బ్యాటరీ కేర్ మంత్’గా హీరో ఎలక్ట్రిక్ సోమవారం ప్రకటించింది. ఇందులోడభాగంగా దేశవ్యాప్తంగా 500లకుపైగా నగరాల్లో ఉన్న తమ 750కిపైగా డీలర్షిప్ కేంద్రాల్లో హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లను ఉచితంగా చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాటరీ కేర్, భద్రతాంశాలను బలపర్చాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అందిస్తున్న ఇతర ఫ్రీ సర్వీసులు, సర్వీస్ క్యాంప్లకు అదనంగా తమ 4.5 లక్షలకుపైగా కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ఓ ప్రకటనలో హీరో ఎలక్ట్రిక్ తెలియజేసింది. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) భద్రతకు సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్ని అత్యవసర చర్యలకు దిగాల్సిన అవసరం ఉన్నది. బ్యాటరీ సంరక్షణ, చార్జింగ్ వ్యవస్థలపై వాహనదారుల్లో అవగాహనను పెంచాలి. అందులో భాగంగానే మేము పలు నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని హీరో ఎలక్ట్రిక్ సీఈవో సోహిందర్ గిల్ తెలిపారు.