Vegetable Oil | న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశంలోకి వంటనూనెల దిగుమతులు పెరిగాయి. ఈ అక్టోబర్తో ముగిసిన ఏడాది (2022-23) కాలంలో వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్స్ 16 శాతం వృద్ధి చెందినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) సోమవారం వెల్లడించింది. 167.1 లక్షల టన్నులుగా ఉన్నట్టు పేర్కొన్నది. అంతకుముందు సంవత్సరం (2021-22 లేదా నవంబర్-అక్టోబర్) 144.1 లక్షల టన్నులుగా నమోదైనట్టు చెప్పింది.
నాన్-ఎడిబుల్స్ తక్కువే
గత నెల అక్టోబర్తో ముగిసిన ఏడాది కాలంలో దేశంలోకి 167.1 లక్షల టన్నుల వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతయితే.. 164.7 లక్షల టన్నులు వంటనూనెలే. 2.4 లక్షల టన్నులు మాత్రమే నాన్-ఎడిబుల్ ఆయిల్స్ అని ఎస్ఈఏ ఈ సందర్భంగా తెలిపింది. అంతకుముందు సంవత్సరంతో చూస్తే ఈసారి 24.4 లక్షల టన్నుల వంటనూనెల దిగుమతి పెరిగినట్టు వివరించింది. ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాటానే ఎక్కువని పేర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వెజిటబుల్ ఆయిల్ కొనుగోలుదారుగా భారత్ ఉన్నట్టు స్పష్టం చేసింది.
రూ.1.38 లక్షల కోట్లు
2022-23లో దేశంలోకి దిగుమతైన వంటనూనెల విలువ రూ.1.38 లక్షల కోట్లుగా ఉన్నది. అయితే అంతకుముందు సంవత్సరం 2021-22లో దిగుమతైన వంటనూనెలు తక్కువే అయినా విలువ రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఎస్ఈఏ చెప్పింది. 2020-21లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నది. ఇక మొత్తం పామాయిల్ దిగుమతుల్లో 25 శాతానికిపైగా ఆర్బీడీ పామోలిన్ ఇంపోర్ట్సే ఉన్నాయి. గతంతో పోల్చితే ఈసారి 18.4 లక్షల టన్నుల నుంచి 21.1 లక్షల టన్నులకు పెరిగాయి.
దేశంలో ఉత్పత్తి పెరగాలి..
దేశంలో వంటనూనె పంటల ఉత్పత్తి పెరగాలని, అప్పుడే విదేశాల నుంచి భారత్కు దిగుమతులు తగ్గుతాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఈ దిశగా రైతులకు కేంద్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా వారు సూచిస్తున్నారు. తెలంగాణలో పామాయిల్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్న విషయం తెలిసిందే. ఆయా సంస్థలతోనూ కలిసి వెళ్తున్న సంగతీ విదితమే. ఈ రకంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాల్లో వంటనూనె పంటలకు ప్రాధాన్యత ఇస్తే.. విదేశీ మారకాన్నీ మిగుల్చుకున్నవారమవుతామని మోదీ సర్కారుకు హితవు పలుకుతున్నారు.