Health Insurance | ఇప్పుడు ప్రతిదీ మనీతో కూడుకున్న వ్యవహారమే.. ఇక ఆరోగ్య సేవలు పొందాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిందే.. రెండు దశాబ్దాల క్రితం అందుబాటులోకి వచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత కరోనా మహమ్మారి తర్వాత పెరిగింది. దాదాపు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. గతంలో సంబంధిత హెల్త్ పాలసీ జారీ చేసిన సంస్థ నెట్ వర్క్ హాస్పిటల్ జాబితాలో గల దవాఖానల్లోనే క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఉండేది. కానీ, ఇక నుంచి ఆరోగ్య బీమా వసతి కల వారు ఏ దవాఖానకైనా వెళ్లి ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్’ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని, గురువారం నుంచే అమల్లోకి వస్తుందని ‘దీ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలతో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అయితే నెట్ వర్క్ హాస్పిటల్స్ జాబితాలో లేని దవాఖానల్లో క్యాష్ లెస్ ఫెసిలిటీ పొందడానికి 48 గంటల ముందు.. ఎమర్జెన్సీతో దవాఖానలో చేరితే.. అలా అడ్మిట్ అయిన 48 గంటల్లోపు సంబంధిత ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం అందజేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనలకు అనుగుణంగా క్లయిమ్ పొందొచ్చునని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా.. నెట్ వర్క్ జాబితాలోని దవాఖానల్లోనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండేది. క్యాష్ లెస్ ఫెసిలిటీ లేని దవాఖానల్లో ట్రీట్మెంట్ ఖర్చు ముందు చెల్లించి, తర్వాత రీయింబర్స్ మెంట్ కోసం అప్లయ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియలో రీఫండ్ ఆలస్యం అవుతుండటంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్ణయంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు సమస్యలు తప్పనున్నాయి.