న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా నరేంద్రమోదీ సర్కారు మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్న భారత్.. కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఈ బడ్జెట్ పునాదిలా తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
తాజా బడ్జెట్ ప్రకారం.. ఇంపోర్టెడ్ పార్ట్స్పై కస్టమ్స్ డ్యూటీ పెంచినందున ప్రజలు సాధారణంగా వినియోగించే చాలా వస్తువుల ధరలు పెరుగనున్నాయి. వాటిలో హెడ్ఫోన్లు, ఇయర్ ఫోన్లు, లౌడ్ స్పీకర్లు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే, కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్, జెమ్ స్టోన్స్పైన కస్టమ్స్ డ్యూటీని 5 శాతం తగ్గించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో ధరలు తగ్గే, ధరలు పెరిగే వస్తువుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
ధరలు తగ్గేవి..
దుస్తులు, జెమ్ స్టోన్లు, డైమండ్లు, సెల్యులార్ మొబైల్ ఫోన్ల కెమెరా లెన్స్, మొబైల్ పోన్ చార్జర్లు, ఫ్రోజన్ మజిల్స్, ఫ్రోజన్ స్క్విడ్స్, అసఫొయేటిడా, కొకోవా బీన్స్, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తుల్లో అవసరమయ్యే రసాయనాలు, స్టీల్ స్క్రాప్.
ధరలు పెరిగేవి..
గొడుగులు, ఇమిటేషన్ జ్యుయెలరీ, సింగిల్ లేదా మల్టిపుల్ లౌడ్ స్పీకర్లు, హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్, ఎక్స్రే మిషన్లు, ఎలక్ట్రానిక్ బొమ్మల విడిభాగాలు.