Budget 2022 | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా సమర్పించే వార్షిక బడ్జెట్పై బాగానే పడింది. శరవేగంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో సంప్రదాయంగా బడ్జెట్ ప్రతుల ముద్రణకు వెళ్లడానికి ముందు హాల్వా తయారీ ప్రక్రియను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. హాల్వా తయారీ సంరంభం లేకుండా బడ్జెట్ ప్రక్రియ చేపట్టడం ఇదే తొలిసారి. యూనియన్ బడ్జెట్ తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్నప్పుడు స్వయంగా ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో హాల్వా సెర్మోనీ నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం కొన్ని రోజుల పాటు లాక్ఇన్లో ఉండే ఉద్యోగులకు మిఠాయి సరఫరా చేయడానికి ఈ హాల్వా తయారు చేస్తారు.
లాక్ఇన్లో ఉండే కేంద్ర ఆర్థికశాఖ అధికారులు, సిబ్బంది తమకు అత్యంత సన్నిహితులతో మాత్రమే మాట్లాడేందుకు అనుమతి ఇస్తారు. నార్త్ బ్లాక్లోనే బడ్జెట్ ప్రింటింగ్ మిషన్ కూడా ఉంది. లాక్ఇన్లో ఉండే ఉద్యోగులు, అధికారులు.. ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించిన తర్వాత బయటకు వస్తారు.
గతేడాది మాదిరిగానే వచ్చే నెల ఒకటో తేదీన 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పేపర్లెస్ బడ్జెట్గా రూపొందిస్తున్నారు. అంటే డిజిటల్గానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పిస్తారు. బడ్జెట్ ప్రతులు అతి కొద్దిగా మాత్రమే ప్రచురిస్తారు. డిజిటల్గా వీటిని యాప్లో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి తెస్తారు. ఇందులో 14 యూనియన్ బడ్జెట్ పత్రాలు ఉంటాయి. వాటిలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ స్పీచ్, వార్షిక ఆర్థిక ప్రకటన (బడ్జెట్), డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లు తదితరాలు ఉంటాయి)