Coding Ninjas | హర్యానాలోని గుర్గ్రామ్ కేంద్రంగా పని చేస్తున్న ఎడ్ టెక్ కంపెనీ ‘కోడింగ్ నింజాస్ (Coding Ninjas) వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. సంస్థలో పని చేస్తున్న సిబ్బంది.. పని వేళ్లలో బయటకు వెళ్లకుండా నిరోధించింది. అందుకోసం ఆఫీసుకు తాళాలు వేయించిన దృశ్యం వీడియో బయటకు వచ్చింది.
సిబ్బంది మొత్తం ఆఫీసులోకి వచ్చిన తర్వాత కార్యాలయం ప్రధాన ద్వారానికి సంస్థ వాచ్ మన్ తాళం వేస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే.. ‘పర్మిషన్ లేకుండా బయటకు ఏ ఉద్యోగిని పంపవద్దని మేనేజర్ చెప్పారు. బయటకు వెళ్లేవారు పర్మిషన్ తెచ్చుకోవాలి’ అని వాచ్ మన్ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియోను కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘రోజురోజుకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పని వాతావరణం దిగజారుతున్నది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా?’ అని దుమ్మెత్తి పోస్తున్నారు. తమ చర్య వివాదాస్పదం కావడంతో కోడింగ్ నింజాస్ యాజమాన్యం రియాక్టయింది.
‘ఈ ఘటనపై మేం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. మా కంపెనీ ఆఫీసులో ఒక ఉద్యోగి విపరీత చర్య వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం.. కొద్ది క్షణాల్లోనే పరిస్థితి చక్కదిద్దాం. సదరు ఉద్యోగి కూడా పొరపాటు అంగీకరించి క్షమాపణ చెప్పారు’ అని కోడింగ్ నింజాస్ అభిప్రాయ పడింది. ఆఫీసు ప్రధాన ద్వారానికి తాళం వేయడం వల్ల ఉద్యోగులకు జరిగిన అసౌకర్యానికి కంపెనీ యాజమాన్యం, ఫౌండర్లు విచారం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పారు.
`ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఆ ఉద్యోగిపైనా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నాం’ అని కోడింగ్ నింజాస్ తెలిపింది. ఆఫీసు ప్రధాన ద్వారానికి తాళం వేయడం ఉద్దేశ పూర్వకంగా చేయలేదని, తమ విలువలకు ఇటువంటి చర్యలు విరుద్ధమని వెల్లడించింది. గత ఏడేండ్లలో దేశీయ యువతలో నైపుణ్యం పెంచడానికి ఎంతో కష్ట పడుతున్నామని పేర్కొంది.