న్యూఢిల్లీ, జనవరి 2: బ్యాంక్లు వాటి షేర్హోల్డర్లకు డివిడెండ్లు ఇచ్చేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాల ముసాయిదాను రిజర్వ్బ్యాంక్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 2005నాటి మార్గదర్శకాలను సవరిస్తూ ఆర్బీఐ తాజాగా ముసాయిదాను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం డివిడెండు ఇచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం లోపు నికర మొండి బకాయిలు (ఎన్పీఏ) ఉన్న బ్యాంక్లే డివిడెండ్లను ప్రకటించాలి.
పాత మార్గదర్శకాల్లో నికర ఎన్పీఏ పరిమితి 7 శాతంగా ఉంది. డివిడెండు చెల్లింపు ప్రతిపాదనలను ఆమోదించేటపుడు బ్యాంక్ బోర్డులు అనుసరించాల్సిన ఆదేశాలను సైతం ఆర్బీఐ ముసాయిదాలో పొందుపర్చింది. ఎన్పీఏ వర్గీకరణ, మొండి బకాయిల కేటాయింపులు జరగాలని ఆదేశించింది. డివిడెండు ప్రకటించాలంటే వాణిజ్య బ్యాంక్కు క్యాపిటల్ అడిక్వసీ రేషియో (సీఏఆర్) కనీసం 11.5 శాతం ఉండాలని పేర్కొంది. అదే చిన్న ఫైనాన్స్ బ్యాంక్కు, పేమెంట్ బ్యాంక్కు 15 శాతం, లోకల్ ఏరియా బ్యాంక్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లకు 9 శాతం చొప్పున ఉండాలన్నది.
చెల్లింపు పరిమితి పెంపు
బ్యాంక్లు షేర్హోల్డర్లకు చెల్లించే డివిడెండ్ల పరిమితిని పెంచుతూ ముసాయిదాలో ఆర్బీఐ ప్రతిపాదించింది. నికర ఎన్పీఏ జీరో అయితే నికరలాభంలో 50 శాతం వరకూ డివిడెండ్గా చెల్లించవచ్చన్నది. గత మార్గదర్శకాల్లో ఈ పరిమితి 40 శాతం. తాత్కాలిక చెల్లింపు కోసం డివిడెండ్ ప్రకటిస్తామంటూ బ్యాంక్లు తమకు చేసే ఎటువంటి వినతినీ అంగీకరించబోమని ముసాయిదాలో ఆర్బీఐ స్పష్టం చేసింది.