చండీగఢ్, జూన్ 29: రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం పొడిగింపుపై ఇంకా ఏ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. గురువారంతో రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారంగా కేంద్రం చేస్తున్న చెల్లింపుల కాలవ్యవధి తీరిపోతున్నది. 2017 జూలై 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 పన్నులను ఏకం చేస్తూ మోదీ సర్కారు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను దేశంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ర్టాలకు వాటిల్లే నష్టాలకుగాను ఐదేండ్లపాటు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిన సంగతీ విదితమే. అయితే ఈ గడువు ఈ నెల 30తో ముగిసిపోతున్నది. దీంతో పరిహారాన్ని పొడిగించాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినప్పటికీ బుధవారం ముగిసిన రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో ఇందుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు. పార్టీలకతీతంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ డిమాండ్ను ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. నిజానికి కరోనా ప్రభావంతో రాష్ర్టాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని, జీఎస్టీ పరిహారాన్ని మరికొన్నేండ్లు ఇవ్వాలని రాష్ర్టాలు ఎప్పట్నుంచో కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ర్టాల ఆర్థిక వృద్ధికి జీఎస్టీ పరిహారం పొడిగింపు ఎంతో దోహదపడుతుందని రాష్ర్టాలు అంటున్నాయి.
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై పన్ను నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తాజా భేటీలో వాయిదా వేసింది. వీటిపై గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీని వేయాలని భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జీఎస్టీని అభివర్ణిస్తూ ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’.. ఇప్పుడు ‘గ్రహస్తి సర్వనాశ్ ట్యాక్స్’ (ఇండ్లను కూలదోసే పన్ను)గా మారుతున్నదంటూ దుయ్యబట్టారు. ఓవైపు ఆదాయం, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇలా పన్నుల భారాన్ని ప్రజలపై మోపడం దారుణమని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.