GST Compensation | జీఎస్టీ పరిహారం పొడిగింపు గానీ, జీఎస్టీలో రాష్ట్రాల వాటా 50 శాతం నుంచి పెంచడం గానీ చేయాలని విపక్షాల పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చండీగఢ్లో మంగళవారం మొదలైంది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు గడువు ఈ నెలతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీ వాటా 70-80 శాతానికి పెంచాలని ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి టీఎస్ సింగ్ దేవ్ డిమాండ్ చేశారు.
కరోనా పాజిటివ్ రావడంతో టీఎస్ సింగ్ దేవ్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాల వాటాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. మైనింగ్, మాన్యుఫాక్చరింగ్ రాష్ట్రాలు జీఎస్టీ వల్ల భారీగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీలో రాష్ట్రాల వాటా 70-80 శాతం, కేంద్రం వాటా 20-30 శాతం మధ్య నిర్ణయించాలని ప్రతిపాదించారు. లేని పక్షంలో ప్రస్తుత పరిహారం చెల్లింపు విధానాన్ని మరో ఐదేండ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, గుర్రప్పందాలపై జీఎస్టీ 28 శాతం విధించాలన్న ప్రతిపాదనపై బుధవారం సమావేశంలో నిర్ణయించనున్నారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. జీఎస్టీ అమలైనప్పటి నుంచి రాష్ట్రాలకు జరిగే రెవెన్యూ నష్టానికి పరిహారం ఐదేండ్ల పాటు అంటే 2022 జూన్ వరకు చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.