GST collections : దేశంలో వస్తు, సేవల పన్ను (Good and Service Tax) వసూళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. భారీగా పన్ను వసూళ్లు జరగడంతో ఈ మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం (GST income) తొలిసారిగా రూ.2 లక్షల కోట్లు దాటింది. బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం.. మార్చిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,83,845 కోట్లతో పోలిస్తే ఇది 8.8 శాతం అధికం కావడం గమనార్హం.
దేశీయంగా స్థిరమైన ఆదాయంతోపాటు దిగుమతులపై పన్ను వసూళ్లు గణనీయంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దిగుమతులపై పన్నుల రాబడి ఏకంగా 17.8 శాతం పెరగగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం 5.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు మార్చిలో రూ.1,77,990 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది 8.2 శాతం ఎక్కువ. మొత్తం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ జీఎస్టీ వసూళ్లు సానుకూల వృద్ధిని కనబరిచాయి.
ఈ ఏడాది స్థూల వసూళ్లు 8.3 శాతం వృద్ధితో రూ.22.27 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఇవి రూ.20.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ సుమారు 7 శాతం జీడీపీ వృద్ధితో ముందుకు సాగుతున్న తరుణంలో జీఎస్టీ వసూళ్లు కూడా అదే స్థాయిలో పెరగడం శుభపరిణామమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.