న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల వృద్ధి మందగించింది. ముగిసిన మార్చి నెలలో ఈ రంగాల వృద్ధి రేటు 3.6 శాతానికే పరిమితమైనట్టు శుక్రవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐదు నెలల తర్వాత ఇంతటి కనిష్ఠ వృద్ధి నమోదుకావడం ఇదే ప్రథమం. 2023 ఫిబ్రవరిలో ఈ రంగాల ఉత్పత్తి 7.2 శాతం పెరగ్గా, గత ఏడాది మార్చి నెలలో 4.8 శాతం వృద్ధిని కనపర్చాయి. 2022 అక్టోబర్లో అత్యల్పంగా 0.7 శాతం మాత్రమే పెరిగాయి. ఆ తర్వాత 2023 మార్చి నెలలోనే వీటి వృద్ధి రేటు కనిష్టస్థాయికి తగ్గింది. సమీక్షా నెలలో 8 రంగాల వృద్ధి వివరాలు..
క్రూడాయిల్ ఉత్పత్తి 2.8 శాతం, విద్యుదుత్పత్తి 1.8 శాతం, సిమెంట్ ఉత్పత్తి 0.8 శాతం చొప్పున తగ్గాయి.బొగ్గు ఉత్పత్తి మాత్రం భారీగా 12.2 శాతం పెరిగింది. ఎరువుల రంగం 9.7 శాతం వృద్ధి సాధించింది. ఉక్కు ఉత్పత్తి 8.8 శాతం, సహజవాయువు ఉత్పత్తి 2.8 శాతం పెరగ్గా, రిఫైనరీ ఉత్పత్తుల విభాగం 1.5 శాతం వృద్ధిని కనపర్చింది. 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరంలో సైతం మౌలిక రంగాల వృద్ధి రేటు తగ్గింది. 2021-22లో 10.4 శాతం వృద్ధి సాధించగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతానికి పరిమితమయ్యింది.