న్యూఢిల్లీ, జూలై 1: జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నిరుడు జూన్కంటే ఇవి 56 శాతం అధికం. 2021 జూన్లో రూ.92,800 కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, పన్ను ఎగవేతల్ని నిరోధించేందుకు మెరుగైన చర్యలు చేపట్టడంతో వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
జీఎస్టీ డే ఉత్సవాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థ మొదలైన తర్వాత నెలవారీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లు దాటడం ఇదే ఐదోసారి అని చెప్పారు. 2022 మార్చి నుంచి వరుసగా నాలుగు నెలలోనూ ఈ మార్క్ను జీఎస్టీ వసూళ్లు అధిగమించాయి. జూన్ నెలలో గత ఏడాది ఇది నెలకంటే దిగుమతైన ఉత్పత్తుల ద్వారా ఆదాయం 55 శాతం పెరగ్గా, దేశీ లావాదేవీలతో 56 శాతం అధికాదాయం లభించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. మే నెలలో రూ.1.41 లక్షల కోట్లు జీఎస్టీ పన్నులు వసూలుకాగా, ఏప్రిల్ నెల వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి.