ముంబై, సెప్టెంబర్ 28: దేశంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ పచ్చజెండా ఊపింది. పుత్తడి… ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ రూపంలో ట్రేడుకానున్నది. బంగారానికి ప్రాతినిథ్యం వహించే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ను (ఈజీఆర్లు), బాండ్లు షేర్ల తరహా సెక్యూరిటీలుగా నోటిఫై చేయనున్నట్లు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ముంబైలో జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర సెక్యూరిటీల్లాగానే ఈజీఆర్లు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ ఫీచర్లను కలిగి ఉంటాయన్నారు. గుర్తింపు పొందిన ఏ స్టాక్ ఎక్స్చేంజైనా ప్రత్యేక విభాగంలో ఈజీఆర్ల ట్రేడింగ్ ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. త్యాగి ఇంకా ఏమన్నారంటే…
సోషల్ స్టాక్ ఎక్సేంజ్కు ఓకే
సామాజిక సంస్థలు, ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఏర్పాటు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ను ఏర్పాటుచేసేందుకు నియమనిబంధనలు రూపొందించాలని బోర్డు నిర్ణయించినట్లు అజయ్ త్యాగి తెలిపారు. సామాజిక సంస్థలు, లాభాపేక్షలేని సంస్థలు (ఎన్పీవోలు) ఎన్జీవోల నిధుల సమీకరణ కోసం ఈ ఎక్స్చేంజ్ను ఉద్దేశించారు. అయితే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎస్ఎస్ఈ)ను ఎప్పటిలోగా ఏర్పాటుచేయాలనేది ఇంకా నిర్ణయించలేదని, దీనిపై ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎస్ఎస్ఈలు ప్రత్యేక విభాగంగా ఉండనున్నాయి. ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా ఇవి నిధుల్ని సమీకరిస్తాయి.