హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ) విభాగానికి ప్రతిష్ఠాత్మక గ్రీన్ చాంపియన్ అవార్డు దక్కింది. రాష్ట్రంలో గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) అవార్డును ప్రదానం చేసింది. దేశంలో గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ఐజీబీసీ ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన సదస్సులో ఎంఏయూడీ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డిలు అవార్డు, సర్టిఫికెట్ను అందుకున్నారు. కాగా, ఐజీబీసీలో 575 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులతో 1,030 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్రీన్ బిల్డింగ్ ఫుట్ ప్రింట్పరంగా దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు మార్గదర్శనంలో హైదరాబాద్లో గ్రీన్ బిల్డింగ్ కల్చర్ గణనీయంగా పెరిగిపోయింది. ఐజీబీసీ గ్రీన్ సిటీస్ రేటింగ్ ప్రకారం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలు బాగున్నాయని తేలింది. ఇటీవలే హైదరాబాద్ ప్రతిష్టాత్మక వరల్డ్ గ్రీన్ సిటీ -2022 అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తున్నది.