Crypto Currency | దేశ ఆర్థిక సుస్థిరతకు ముప్పని ఆర్బీఐ వాదిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల పట్ల బ్యాలెన్సింగ్ వ్యూహాన్నిఅమలు చేయనున్నదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీపై ప్రత్యేకమైన నియంత్రణ గానీ, నిషేధం గానీ అమల్లో లేవు. బడ్జెట్కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరేమిటో వెల్లడించలేదు. సోమవారం సంజీవ్ సన్యాల్ మీడియాతో మాట్లాడుతూ దానిపై కొంత చర్చ జరిగింది. ప్రభుత్వం, ఆర్థికశాఖ, పార్లమెంట్లోనూ చర్చించాం. తాజాగా ఇప్పుడు కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు.
వర్చువల్ కరెన్సీలతో దేశ ఆర్థిక సుస్థిరతతోపాటు పలు అంశాలపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. క్రిప్టో కరెన్సీల్లో కొన్ని ఆర్థిక సుస్థిరత అంశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ పట్ల ఇతర వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం బ్యాలెన్సింగ్ వ్యూహాన్ని అమలు చేయనున్నదని సంజీవ్ సన్యాల్ తెలిపారు.
బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా సారధ్యంలోని ఆర్థికశాఖ పార్లమెంటరీ స్థాయీ కమిటీ ముందు క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ల ప్రతినిధులు, బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ (బీఏసీసీ) సభ్యులు, ఇతర భాగస్వాములు హాజరయ్యారు. క్రిప్టో కరెన్సీలపై ఎటువంటి నిషేధం విధించొద్దని కోరారు. క్రిప్టో లావాదేవీలపై నియంత్రణ విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ఇటీవల కేంద్రం కూడా క్రిప్టో కరెన్సీలపై బిల్లు పార్లమెంట్కు తేవాలని నిర్ణయించినా.. ఇప్పటివరకు క్యాబినెట్ ముందుకు ముసాయిదా బిల్లు రాలేదు.