న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోను వచ్చే మే నెల తొలినాళ్లలో జారీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లతో ప్రభుత్వం చర్చిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరం మార్చి 31లోగా ఎల్ఐసీ ఆఫర్ను తీసుకురావాలన్న గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం కారణంగా మార్కెట్లో ఏర్పడ్డ ఒడిదుడుకులతో ఐపీవో వాయిదా పడింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రభుత్వ అధికారులు ఆఫర్ జారీకి శ్రమిస్తున్నారని, ప్రస్తుతం మార్కెట్ కుదుటపడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 7 శాతం వాటా వరకూ ఐపీవో ద్వారా విక్రయించి, రూ.50,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం చూస్తున్నట్టు బ్లూంబర్గ్ వార్తా సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. ఈ అంశమై ఇంకా కసరత్తు జరుగుతున్నందున, నిధుల సమీకరణ లక్ష్యంలో మార్పు ఉండవచ్చని అంటున్నారు.
మే 12 వరకూ గడువు
ఎల్ఐసీ ఆఫర్ కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన అనుమతి మే 12 వరకూ వర్తిస్తుంది. ఈ లోపునే క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఐపీవో పబ్లిక్ ఆఫర్ ముసాయిదా డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను ఫిబ్రవరి 13న సెబీకి సమర్పించగా, మార్చి 8న అనుమతి లభించిన విషయం తెలిసిందే. మే 12లోపున ఐపీవో తేలకపోతే, తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాము మార్కెట్ ఒడిదుడుకుల్ని గమనిస్తున్నామని ఎల్ఐసీ చెప్తున్నది. ఏ ధరకు ఆఫర్ జారీచేసేదీ తెలియచేస్తూ సెబీకి త్వరలో రెడ్హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్హెచ్పీ) సమర్పిస్తామని ఓ అధికారి తెలిపారు. ముసాయిదా డాక్యుమెంట్ ప్రకారం ఎల్ఐసీలో 31 కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు ప్రభుత్వం ప్రతిపాదించింది.