Nirmala on Crypto’s | క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, వాటిపై నిషేధం, నియంత్రణ తదితర అంశాలపై వస్తున్న వదంతులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. క్రిప్టో కరెన్సీలపై ఇంత భారీ స్థాయిలో వదంతులు రావడం అందరికీ ఆరోగ్యకరం కాదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీల నియంత్రణకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శనివారం హిందూస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాలతో సంప్రదించిన తర్వాత.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతే క్రిప్టో కరెన్సీ బిల్లును పార్లమెంట్కు సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన సభికులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఇంత భారీ స్థాయిలో వదంతులు రావడం అందరికీ ఆరోగ్యకరం కాదన్నారు.
ఆర్బీఐ ఆధ్వర్యంలో అధికారిక డిజిటల్ కరెన్సీ జారీ చేయడానికి ఫ్రేమ్వర్క్ ఖరారు కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తున్నది. క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2021ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఇప్పటికే లోక్సభ బులెటిన్లో ప్రభుత్వం వెల్లడించింది.