LIC IPO | భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవోను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ విలువను రూ.15 లక్షల కోట్లు (203 బిలియన్ల డాలర్లు)గా ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోకు వెళ్లేందుకు ఎల్ఐసీ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ విలువ ఖరారుపై ఎల్ఐసీ నివేదిక కోసం కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు ఎదురు చూస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ ఎల్ఐసీ విలువ రూ.4 లక్షల కోట్లకంటే ఎక్కువగా ఉంటే. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు నాలుగు రెట్లు ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఎల్ఐసీ తన విలువను ఖరారు చేస్తూ నివేదిక పంపిన తర్వాత ప్రభుత్వం మార్పు కోరే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరుతో మొదలయ్యే వారంలో ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదనను సెబీకి సమర్పించనున్నట్లు తెలుస్తున్నది. ముందుగా ఖరారు చేసిన విలువ కంటే బీమా సంస్థ మార్కెట్ విలువ మూడు నుంచి ఐదు రెట్లు ఉంటుందని అధికార వర్గాల కథనం.
ప్రభుత్వం ప్రతిపాదించిన గణాంకాల ప్రకారం దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సరసన ఎల్ ఐసీ నిలుస్తుందని ఇన్వెస్టర్లు అంగీకరిస్తున్నారు. ఈ అంశాలపై స్పందించేందుకు ఆర్థికశాఖ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. ఎల్ఐసీ వర్గాలు నిరాకరించాయి. కరోనాతో పెరిగిపోయిన ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఎల్ఐసీ ఐపీవో ద్వారా 5-10 శాతం వాటాల విక్రయంతో రూ.75 వేల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు వినికడి. ఈ నెలాఖరులో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై.. ఎల్ఐసీలో ఎంత వాటా విక్రయించాలో నిర్ణయించనున్నదని సమాచారం.