LIC CEO : ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీను ప్రైవేట్ పరం చేసే దిశగా మరో ముందడుగు పడనుంది. ఎల్ఐసీకి మొదటి కార్యనిర్వాహక అధికారిగా ప్రైవేట్ రంగంలోని నిపుణుడిని నియమించనున్నట్టు సమాచారం. ఒకవేళ అదే జరిగితే.. దేశంలోనే పెద్ద ఇన్షూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ సంస్థ వ్యక్తి అధికారి కావడం 66 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. ఈ విషయాన్ని ఇద్దరు ప్రభుత్వ అధికారులు వెల్లడించినట్టు రైటర్స్ మీడియా సంస్థ తెలిపింది. ‘ప్రైవేట్ సంస్థకు చెందిన వ్యక్తిని సీఈఓగా నియమించడం వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయి. షేర్ హోల్డర్స్కు ఇది శుభ పరిణామం’ అని మరొక ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఎల్ఐసీకి ప్రైవేట్ రంగంలోని వ్యక్తిని బాస్గా నియమించడాన్ని తాను సమర్థిస్తున్నట్టు ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు.
ప్రైవేట్ రంగంలోని వ్యక్తిని ఎల్ఐసీ సీఈఓగా నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు అర్హులైన వాళ్ల నుంచి దరఖాస్తులు అహ్వానిస్తోంది అని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ విషయం నిజమేనా? అనేది తెలుసుకునేందుకు ఈ-మెయిల్ ద్వారా ఆర్థిక శాఖను రైటర్స్ సంప్రదించింది. కానీ, ఆ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం మంగళం రామసుబ్రమణియన్ కుమార్ ఎల్ఐసీ ఛైర్మన్గా ఉన్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగుస్తుంది. అయితే.. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఎల్ఐసీ ఛైర్మన్ పోస్ట్ను రద్దు చేసే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉంది. ఎల్ఐసీకి ప్రస్తుతం 41 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.