GST Compansation | జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని బ్యాక్టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది. ఇటీవల లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ పరిహారం చెల్లింపు అంశాన్ని లేవనెత్తారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం 14 శాతానికంటే తక్కువ ఉంటే ఐదేండ్ల పాటు కేంద్రం పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేక రుణ పరపతి వ్యవస్థకు ఆమోదం తెలిపింది. వివిధ వస్తువులపై వసూలు చేసే పరిహార సెస్ను రుణాలు, వాటి వడ్డీ చెల్లింపులకు వాడుకోవచ్చు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ ప్రత్యేక రుణ పరపతి స్కీమ్కు ఆమోదం తెలిపింది. దీనికింద రాష్ట్రాలు మొత్తం రూ.1.10 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.75 వేల కోట్ల వరకు రాష్ట్రాలు రుణాల రూపేణా పొందాయి. ఈ ఏడాది చివరికల్లా ఇది రూ.1.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.